‘విద్యా కమిషన్ సిఫారసులు సరికాదు’
జన్నారం: విద్యా కమిషన్ సిఫారసులు ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని, ముఖ్యంగా జీతాభత్యాల గురించి ప్రస్తావించడం చాలా దారుణమని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జాదవ్ వెంకట్రావు డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి నెల జీతం రూ.1.50 లక్షలు ఉండటంలో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో సంఘం ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేశ్నాయక్, రాష్ట్ర నాయకులు బాదావత్ ప్రకాష్ నాయక్, రాములు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాలఅర్బన్: విద్యా కమిషన్ సిఫారసులో హేతుబద్ధతలేదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర సహ అధ్యక్షుడు బండి రమేశ్ అన్నారు. ఆదివారం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బదిలీలు వద్దని, టీచర్లు ఒకే చోట పనిచేయాలని, వేతనాలు ఎక్కువగా ఉన్నాయనడం ఏమాత్రం సరికాదన్నారు. కమిషన్ నివేదికను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తపస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు, రమాదేవి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవికుమార్, భారతీ అశోక్, జిల్లా బాధ్యులు నీలేష్కుమార్, సమ్మయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


