ఇంటర్ పరీక్షలకు 117మంది గైర్హాజరు
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో 5,640మంది విద్యార్థులకు గాను 5,523మంది హాజరయ్యారు. 117మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 4,851 మందికి 4,758 మంది హాజరు కాగా 94మంది రాలేదు. ఒకేషనల్ విద్యార్థులు 788మందికి గాను 765 మంది హాజరు కాగా 23మంది గైర్హాజరయ్యారని డీఐఈవో అంజయ్య తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్లతో కలిసి సందర్శించారు. భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాలు పరిశీలించారు. పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంచిర్యాల ఇన్స్పెక్టర్ ప్రమోద్రావు, టాఫ్రిక్ ఇన్స్పెక్టర్ సత్యానారాయణ పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
చెన్నూర్/జన్నారం: ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం ఆయన స్థానిక ప్రభుత్వ జూనియర్, టీజీ ఎస్డబ్ల్యూ కళాశాలలో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి అంజయ్య పాల్గొన్నారు. జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కరిమల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు.


