అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
సారంగపూర్: మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్(28) అనే వ్యక్తి రెండురోజుల క్రితం అదృశ్యం కాగా గురువారం ఆయన మృతదేహం మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు బ్యాక్వాటర్లో లింగాపూర్ వంతెన వద్ద లభ్యమైంది. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్మాయిల్ గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం నమాజ్కు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. ఎంతకూ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడ గాలించినా ఆచూకీ లభించలేదు. ఈక్రమంలో స్వర్ణ ప్రాజెక్టు బ్యాక్వాటర్లో లింగాపూర్ వంతెన వద్ద అటుగా వెళ్లిన వ్యక్తులకు మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్సై శ్రీకాంత్ అక్కడికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించగా అతడు ఇస్మాయిల్గా గుర్తించారు. జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ఇస్మాయిల్ తండ్రి ఇబ్రహీం పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


