విద్యార్థుల మేధకు ‘అభ్యాసవేదిక’
ఏఐ సాయంతో వెబ్పేజీ రూపొందించిన హెచ్ఎం మునీందర్రాజు విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా మ్యాథమెటిక్స్, సైన్స్ బోధనలు ఎస్సీఈఆర్టీ సెమినార్కు ఎంపికై న ప్రధానోపాధ్యాయుడు
సారంగపూర్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలన్న అతని ఆలోచనకు ఏఐ టెక్నాలజీ తోడైంది. ఆయనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) జోడించి ‘అభ్యాసవేదిక’ అనే వెబ్పేజీని రూపొందించారు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి(బి) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మునీందర్రాజు. అందులో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో మ్యాథమెటిక్స్, సైన్స్ పాఠాలు బోధిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఆయన సృజనాత్మకత, బోధించే పాఠ్యాంశాలను గమనించిన ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్), తెలంగాణ ఆయనను గణిత సెమినార్కు ఎంపిక చేసింది. గతేడాది సైతం ఆయన గణిత సెమినార్కు ఎంపికవ్వడం విశేషం.
ఎప్పటికప్పుడు అప్డేట్..
ఏఐ టెక్నాలజీ సహాయంతో అనేక గణిత మోడల్లను రూపొందించి వెబ్పేజీలో పొందుపరిచారు. దీంతో విద్యార్థులు ప్రశ్న అడిగిన వెంటనే సమాధానాలు ప్రత్యక్షమయ్యే రీతిలో వెబ్పేజీ పనిచేస్తుందని మునీందర్రాజు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన అభ్యాసదీపికలోని పలు సబ్జెక్టులకు సైతం దశలవారీగా సమాధానాలు అందించేలా అభ్యాసవేదికను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కాగా ఉపాధ్యాయుల కోసం సైతం టెట్ మెటీరియల్ రూపొందించి తన అభ్యాసవేదిక వెబ్లో పొందుపరిచారు.
ఆన్లైన్ పాఠాలు..
మునీందర్రాజు ఆదిలాబాద్ జిల్లా బోథ్లో ఉపాధ్యాయుడిగా పనిచేసే సమయంలో మునీందర్సార్ అనే యూట్యూబ్ ఛానల్ రూపొందించారు. అందులో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం ఆన్లైన్ పాఠాలు బోధించేవారు. ఆయన చేసిన కృషికి 2020 డిసెంబర్ 22న గణిత దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఉత్తమ గణిత ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. కోవిడ్ సమయంలో గణిత శాస్త్రబోధనా మెళుకువలు అనే వ్యాసాలు రాసి టీచ్మింట్, జూమ్ యాప్ ద్వారా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులు బోధించారు. ఇందుకు 2021 డిసెంబర్ 5న అప్పటి కలెక్టర్, డీఈవోల చేతులమీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.


