అవయవాలు దానం చేసి.. ఆయుష్షు పోసి..!
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్అర్బన్: బ్రెయిన్స్ట్రోక్తో మృతిచెందిన మహిళ అవయవాలు దానం చేసి ప్రాణదాతగా నిలిచారు. ప్రసవం తర్వాత 23 రోజులకే ప్రాణాలు కోల్పోవడంతో ఇద్దరు పిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్కు చెందిన గుండు నాగరాజుకు మందమర్రికి చెందిన సృజనతో 2018లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉండగా ఉద్యోగరీత్యా వియత్నాంలో నివసిస్తున్నారు. ఇటీవల సృజన గర్భం దాల్చడంతో ప్రసవం కోసం మందమర్రిలోని తల్లిగారి ఇంటికి వచ్చింది. 23 రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడు పుట్టిన సందర్భంగా వియాత్నం నుంచి నాగరాజు 11 రోజుల పాటు కుటుంబంతో గడిపి తిరిగి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఈ నెల 21న తల్లిగారింట్లో ఉండగా అకస్మాత్తుగా తలనొప్పిగా ఉందని సృజన స్పృహ కోల్పోయింది. కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్లో యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెదడు పనితీరు పూర్తిగా నిలిచిపోయిందని బ్రెయిన్డెడ్గా నిర్ధారించారు.
నలుగురికి ప్రాణంపోస్తూ..
బ్రెయిన్ డెడ్ కావడంతో వైద్యులు, జీవన్దాన్ సంస్థ ప్రతినిధులు కుటుంబ సభ్యులకు అవయవ దానం గురించి అవగాహన కల్పించారు. విషయం తెలుసుకుని నాగరాజు వియాత్నం నుంచి హైదరాబాద్ చేరుకుని భార్య అవయవాలను దానం చేయడానికి అంగీకరించాడు. ఈ నెల 25న రాత్రి వైద్యులు సృజన రెండు మూత్ర పిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు సేకరించారు. అనంతరం సృజన పార్థివ దేహానికి వైద్యులు, సిబ్బంది గౌరవ వందనం చేసి నివాళులర్పించడం పలువురి హృదయాలను కదలించింది.
జన్కాపూర్లో అంత్యక్రియలు
జిల్లా కేంద్రంలోని జన్కాపూర్లో గురువారం సృజన అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి చితికి ఐదేళ్ల కుమారుడు కుటుంబ సభ్యుల సహాయంతో నిప్పంటించగా గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. విషాదాన్ని తట్టుకుని అవయవ దానానికి ముందుకొచ్చిన సృజన కుటుంబసభ్యులను జీవన్దాన్ ప్రతినిధులు, సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, సభ్యులు అభినందించారు.
అవయవాలు దానం చేసి.. ఆయుష్షు పోసి..!


