చిన్ననాటి నుంచి ముక్కుసూటి మనిషి
చెన్నూర్: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి చిన్ననాటి నుంచి ముక్కుసూటి మనస్తత్వం కల్గిన వ్యక్తి అని ఆయనతో చిన్నప్పుడు కలిసి చదువుకున్న మిత్రులు చెబుతున్నారు. పోలీసులకు లొంగిపోయిన మల్లా రాజిరెడ్డితో చిన్నప్పుడు కలిసి చదువుకున్న రోజులను చెన్నూర్ మండలం సోమనపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డిపో మేనేజర్ చెరుకు ప్రభాకర్రెడ్డి ‘సాక్షి’తో నెమరేసుకున్నారు. మల్లా రాజిరెడ్డి గురించి ప్రభాకర్రెడ్డి మాటల్లో.. సోమనపల్లి నుంచి మంథనికి చదువుకునేందుకు వెళ్లాను. మంథని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాం. మంథని హైస్కూల్లో 6వ తరగతి చదువుకునే రోజుల్లో మల్లా రాజిరెడ్డితో స్నేహం ఏర్పడింది. ఆయనది మంథని మండలంలోని శాస్త్రులపల్లి గ్రామం. మల్లా రాజిరెడ్డి చదువుకునే రోజుల్లోనే ముక్కుసూటి వ్యక్తి. పాఠాలు అర్థం కాలేదని ఉపాధ్యాయులను ధైర్యంగా ప్రశించేవాడు. మా క్లాస్ టీచర్ ప్రభాకర్ సార్ రాజిరెడ్డిని బెత్తంతో కొట్టినా దెబ్బలు పడే వాడే కానీ ఏనాడూ ప్రశ్నించే అలవాటు మానుకోలేదు. స్నేహితులతో సరదాగా గడుపుతూ చదువులో మాత్రం ఎప్పుడు ముందు వరుసలో ఉండేవాడు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయాం. 1976 –1978 మధ్యలో మావోభావజాలం పట్ల ఆకర్షితుడై అజ్ఞాతంలోకి రాజిరెడ్డి వెళ్లినట్లు తెలిసింది. మల్లా రాజిరెడ్డి 48 ఏళ్ల పాటు అజ్ఞాత జీవనం సాగించాడు. ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిపోయాడని తెలిసి సంతోషించాం. అవకాశం ఉంటే రానున్న రోజుల్లో మల్లా రాజిరెడ్డిని, ఇతర నా చిన్ననాటి స్నేహితులను కలుస్తా.


