పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి
● సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాలక్రైం: పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి నేర విచారణ వేగవంతం చేయాలని రామగుండం పోలీస్ క మిషనర్ అంబ ర్ కిషోర్ ఝా అన్నారు. పోలీస్ కమిషనరేట్ ఆవరణలో మంగళవారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో జనవరి నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర దర్యాప్తులో నాణ్యతను మెరుగుపర్చడంతోపాటు కేసుల పరిష్కార శాతాన్ని పెంచాలని తెలిపారు. ప్రతీ కేసును పారదర్శకంగా తీసుకుని బాధితులకు న్యాయం జరిగే విధంగా పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. ప్రతీ శనివారం కమిషనరేట్, పోలీస్స్టేషన్ పరిధిలో కోర్టు కానిస్టేబుల్తో కోర్టు సంబంధిత అంశాలపై సమావేశం నిర్వహించి, కేసుల పురోగతిని ఎస్హెచ్వోలు పరిశీలించాలని తెలిపారు. పదో తరగతి, ఇంటర్ ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లడం, జవాబు పత్రాలను పోలీస్స్టేషన్లకు తీసుకొచ్చే వరకు భద్రత కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు ప్రకాష్, రమేష్, కృష్ణ, రవికుమార్, వెంకటేశ్వర్లు, వెంకట రంగారెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


