ఆధునిక సాగు విధానాలు వివరించాలి
నెన్నెల: ఆధునిక సాగు విధానాలను రైతులకు వివరించి అధిక దిగుబడులు సాధించేందుకు అధికారులు తోడ్పాటు అందించాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ అన్నారు. నెన్నెల రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) డివిజన్ స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులను చైతన్యపర్చేందుకు క్షేత్ర సందర్శనలు, అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై వివరించాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో రైతులతో క్షేత్ర ప్రదర్శన కోసం కార్యాచరణ రూపొందించాలని అన్నారు. రైతులకు లబ్ధి చేకూర్చేందుకు బీఎఫ్ఏసీ కమిటీ సభ్యులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఆత్మకు బడ్జెట్ కేటాయింపులు, రైతుల శిక్షణ కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారులు పుప్పాల సృజన, ప్రశాంత్, వీరన్న, యమున, దుర్గ, ఉద్యానవన అధికారి అరుణ్కుమార్, పశుసంవర్థక శాఖ అధికారి స్వేత, మత్స్యశాఖ అధికారి భవ్యశ్రీ పాల్గొన్నారు.


