ఆలస్యం చేస్తే తప్పదు వేటు
కౌంటింగ్ జరిగిన 45 రోజుల్లోగా లెక్కలు చూపాల్సిందే నిర్లక్ష్యం చేస్తే పదవి కోల్పోయే ప్రమాదం ఓడిన వారు వచ్చే ఎన్నికల్లో పోటీకి అనర్హులు కార్పొరేటర్ అభ్యర్థికి రూ.1.50 లక్షలు.. కౌన్సిలర్కు రూ.లక్ష ఖర్చు దాటకూడదనే నిబంధన
డివిజన్లు అభ్యర్థులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మున్సిపల్ ఎన్నికల ముగిసి నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. పుర ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి ఎన్నికల నిబంధనల మేరకు ఖర్చు చేసిన వివరాలు అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకు ఎన్నికల సంఘం గడువు విధించగా అభ్యర్థులు గడువులోగా లెక్కలు అప్పగించకుంటే అనర్హత వేటు తప్పదు. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తోపాటు లక్సెట్టిపేట, చెన్నూర్, క్యాతనపల్లి, బెల్లంపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కాగజ్నగర్, నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 328 వార్డుల్లో 1,583 మంది పోటీ పడ్డారు. వీరంతా తమ ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను ఓట్ల లెక్కింపు జరిగిన 45 రోజుల వ్యవధిలో అప్పగించాలి. బ్యాలెట్ నమూనా పత్రాల ముద్రణ, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీల ఏర్పాటు, ప్రచార ర్యాలీ ఖర్చులు, టిఫిన్లు, భోజన ఖర్చుల వివరాలు, కార్యకర్తల ఖర్చుల వివరాలు, ప్రచారం కోసం వినియోగించిన వాహనాల డీజిల్, డ్రైవర్ ఏర్పాటు ఖర్చులు, ఇతర పోలింగ్ ఖర్చుల వివరాలను కూడా లిఖిత పూర్వకంగా అందించాలి. గెలుపు, ఓటములకు సంబంధం లేకుండా అభ్యర్థులు తమ నామినేషన్ల పర్వం మొదలు ప్రచారం ముగిసే వరకు కూడా రోజూవారీ లెక్కలు పుర కార్యాలయాల్లో అందించాలి. ఇప్పటికే పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలు చాలా వరకు అప్పగించలేదు. 45 రోజుల్లో అప్పగించని పక్షంలో వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. ఓడిన వారిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటిస్తారు.
కౌన్సిలర్కు రూ.లక్ష వరకు..
ఎన్నికల్లో గెలిచి పదవులు దక్కంచుకోవాలనే లక్ష్యంతో అభ్యర్థులు రూ. లక్షలు దాటి రూ.కోట్లలో కూడా ఖర్చులు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక్కో కార్పొరేటర్ అభ్యర్థికి రూ.1.50 లక్షలు, కౌన్సిలర్ అభ్యర్థికి రూ.లక్ష వరకు ఎన్నికల ఖర్చు దాటకూడదనే నిబంధన ఉంది. కానీ చాలా మంది అభ్యర్థులు పరిమితికి మించి ఖర్చు చేశారని వారి హంగామా చూస్తే తెలిసిపోతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు కుమ్మరించారు. నిఘా అధికారుల కళ్లు గప్పి మరీ భారీగా ఎన్నికల ఖర్చు పెట్టారు. నిత్యం మందు, విందులతో పాటు పోలింగ్కు ముందు రోజు ఓటరు ఇంటింటికీ వెళ్లి మరీ డబ్బులు, మద్యం, చీరలు, ఇతర కానుకలు అందించారు. అయితే నిబంధనల మేరకు గడువులోగా ఎన్నికల ఖర్చులు రూ. 50 వేలకు మించకుండా చూపించేలా అభ్యర్థులు నివేదికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు..
మున్సిపాలిటీ వార్డులు/ బరిలో నిలిచిన
మంచిర్యాల 60 240
బెల్లంపల్లి 34 172
చెన్నూర్ 18 107
క్యాతన్పల్లి 22 113
లక్సెట్టిపేట 15 60
ఆసిఫాబాద్ 20 94
కాగజ్నగర్ 30 130
ఆదిలాబాద్ 49 314
నిర్మల్ 42 182
ఖానాపూర్ 12 56
భైంసా 26 115
మొత్తం 328 1,583


