శనగ పంటకు నిప్పు
కై లాస్నగర్(బేల): పంట చేతికందే క్రమంలో గుర్తుతెలియని దుండగులు నిప్పంటించడంతో పంట పూర్తిగా ఆహుతైన ఘటన బేల మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని డోప్టాల గ్రామానికి చెందిన రైతు అంకత్వార్ శంకర్ బేల శివారులో ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని శనగ పంట సాగు చేశాడు. పంట కోతకు రావడంతో మూడు రోజుల క్రితం కూలీలతో కోయించి హార్వెస్టింగ్ చేసేందుకు చేనులో కుప్పగా నిల్వ ఉంచాడు. సోమవారం వేకువజామున వర్షం రావడంతో పంటపై కప్పేందుకు తాడిపత్రులు తీసుకుని చేనుకు వెళ్లాడు. నిల్వ ఉంచిన పంట కాలిపోయి ఉండడం చూసి ఆవేదనకు గురయ్యాడు. దాదాపు 30 క్వింటాళ్ల శనగ పంటకు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంతో రూ.1.50లక్షల వరకు నష్టపోయాయని వాపోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భైంసా మండలంలో..
భైంసారూరల్: మండలంలోని మాంజ్రి గ్రామానికి చెందిన చిరబోయిన చక్రధర్ అనే రైతుకు చెందిన శనగ కుప్పకు ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఎస్సై సుప్రియ తెలిపిన వివరాల ప్రకారం... శనగ పంటను కోసి తన పంట పొలంలోనే కుప్పగా పోసి నూర్పిడి చేసేందుకు సోమవారం ఉదయం రైతు పొలానికి వెళ్లగా కుప్ప కాలి బూడిదై ఉంది. బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సుప్రియ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.


