ఐటీడీఏ ఎదుట గిరిజనుల ఆందోళన
ఉట్నూర్రూరల్: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న తాము తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని, తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ కొలాం గిరిజనులు ఆందోళన బాట పట్టారు. సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదంటూ సోమవారం ఐటీడీఏ ఎదుట ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆదిమ గిరిజన కొలాం సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనేరావ్, జిల్లా అధ్యక్షుడు వసంత్ రావ్లు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే వరకు రిలేనిరాహార దీక్షలు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నా గిరిజనుల తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇళ్లను కట్టుకోనివ్వకుండా కోర్ ఏరియా అంటున్నారని వాపోయారు. దీక్షలకు ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆశన్న మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కొలాం సేవ సంఘం రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు లక్ష్మణ్, రాజు, ఆయా కొలాం గూడాల, గ్రామాల పటేళ్లు, ప్రజలు పాల్గొన్నారు.


