టీజీసెట్కు 95.94 శాతం హాజరు
బెల్లంపల్లి: ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో ఐదో తరగతిలో పూర్తి సీట్లు, 6, 7, 8, 9 తరగతుల్లో మి గులు సీట్ల భర్తీ కోసం ఆదివారం జిల్లాలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 95.94 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, లక్ష్సెట్టిపేట, కోటపల్లి, జైపూర్, కాసిపేట, మందమర్రిలో 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీ క్షకు 5,173 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4,963 మంది హాజరు కాగా, 210 మంది గైర్హాజరైనట్లు మంచిర్యాల డీసీవో రమాకళ్యాణి ప్రకటించారు. తరగతులవారీగా పరిశీలిస్తే ఐదో తరగతిలో 2,286 మందికి 2,217 మంది హాజరు కాగా, 69 మంది గైర్హాజరయ్యారు. ఆరోతరగతిలో ప్రవేశానికి 1,487 మందికి 1,418మంది హాజరుకాగా, 69 మంది హాజరు కాలేదు. ఏడో తరగతిలో 518 మందికి 495మంది పరీక్ష రాయగా 23మంది గైర్హాజరయ్యారు. ఎనిమిదో తరగతిలో 560 మందికి 527 మంది హాజరు కాగా, 33మంది హాజరు కాలేదు. తొమ్మిదో తరగతిలో 322మందికి 306మంది హాజ రు కాగా, 16 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.
గంట ముందే పరీక్షా కేంద్రాలకు..
ప్రవేశ పరీక్ష ఉదయం 11గంటలకు ఉండగా విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాలు జంబ్లింగ్ పద్ధతిలో కేటాయించారు. దీంతో చెన్నూర్, లక్సెట్టిపేట, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంత విద్యార్థులు ప్రత్యేక వాహనాల్లో కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల ప్రధాన గేటు వద్ద విద్యార్థులను పరీక్షించి లోనికి పంపించారు. తల్లిదండ్రులు, తోబుట్టువులు వెంట రావడంతో కేంద్రాల వద్ద సందడి కనిపించింది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.


