చేపలవేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
నెన్నెల: చేపలవేట చేస్తుండగా ప్రమాదవశాత్తు వల కాళ్లకు చుట్టుకుని మత్స్యకారుడు మృతిచెందాడు. ఎస్సై ప్రసాద్ కథనం ప్రకారం.. మండలంలోని ఆవుడం గ్రామానికి చెందిన కునారపు లింగయ్య(58) అనే జాలరి అందరితో కలిసి ఆదివారం గుండ్లచెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చెరువులో పెద్ద నీటిగుంత ఉండటంతో ప్రమాదవశాత్తు కాలు జారి గుంతలో పడిపోయాడు. వల చుట్టుకోవడంతో బయటకు రాలేకపోయాడు. గమనించిన తోటి మత్స్యకారులు బయటకు తీసేసరికి ఊపిరి ఆడక అప్పటికే మృతిచెందాడు. భార్య రామక్క ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


