మేయర్, చైర్మన్ ఎన్నిక పకడ్బందీగా చేపట్టాలి
నస్పూర్: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మేయర్, చైర్మన్ అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణీకుముదిని అన్నారు. సోమవారం ఆమె హైదరాబాద్ నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో మేయర్, చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రకటించాలని అన్నారు. 11న పోలింగ్, 12న రీపోలింగ్, 13న ఓట్ల లెక్కింపు ఉంటాయని తెలిపారు. అనంతరం మేయర్, చైర్పర్సన్ ఎన్నిక ఎంపిక ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు జశ్వంత్, రాజేంద్రప్రసాద్, మహేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


