ముస్తాబైన గద్దెలు
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల గోదావరి నదితీరాన ఈనెల 28 నుంచి 31 వరకు నిర్వహించనున్న సమ్మక్క, సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఇల్లారి (తల్లుల గుడి) నుంచి సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్నను తీసుకువచ్చి మేడారంకు చెందిన గిరిజన పూజారులు జవ్వ సతీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గద్దెలపై ప్రతిష్టించడంతో జాతర ప్రారంభం కానుంది. మహారాష్ట్రతో పాటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. గద్దెల వద్ద షామియానాలు, విద్యుత్ లైట్లు అమర్చారు. తాగునీటి సరఫరా, స్నానాలు ఆచరించేందుకు ఆకాశగంగ (నల్లాలు)లు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు నిర్మించారు. సరస్వతి శిశుమందిర్కు సమీపంతో పాటు ఎదురుగా ఉన్న మాతాశిశు ఆస్పత్రి ఖాళీ స్థలంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. సీఐ ప్రమోద్రావు పార్కింగ్ స్థలాల ను పరిశీలించి పలు సూచనలు చేశారు.
సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో..
మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగులకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం స్తానిక బాలుర పాఠశాల మైదానంలో అన్నదానం నిర్వహించారు. మూడు రోజుల పాటు అన్నదానం చేపడుతామని ట్రస్టు సభ్యులు తెలిపారు.


