కొత్త మండలాల డిమాండ్లు
రెండు, మూడేసి జిల్లాల్లో పలు అసెంబ్లీ స్థానాలు కొన్ని చోట్ల ఒకే మండలం.. పలు నియోజకవర్గాల్లో నిధుల మంజూరు, లబ్ధిదారుల ఎంపికలో సమస్యలు అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి ప్రకటనతో ఊరట!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించినా పలు చోట్ల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా కేంద్రానికి దూరభారం తగ్గింది. కానీ వేర్వేరు నియోజకవర్గాల్లో ఉండడంతో సమస్యలు వస్తున్నాయి. తాజాగా అసెంబ్లీ వేదికగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేస్తామని ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో పలు మండలాలు, గ్రామాలను పరిపాలన సౌలభ్యం కోసం పునర్విభజన చేస్తే పాలన సులువు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పది శాసనసభ, రెండు లోక్సభ ఆదిలాబాద్(ఎస్టీ), పెద్దపల్లి(ఎస్సీ) నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్లో నిర్మల్, ముథోల్, ఖానాపూర్, మంచిర్యాలలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్, ఆసిఫాబాద్ ఉన్నాయి. పలు మండలాలు వేర్వేరు నియోజకవర్గాల్లో కొనసాగుతున్నాయి.
మూడు జిల్లాల్లో ఖానాపూర్
ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం ఉమ్మడి జిల్లా పరిధిలోని మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. నియోజకవర్గ కేంద్రం ఖానాపూర్తో సహా పెంబి, దస్తూరాబాద్ మండలాలు నిర్మల్ జి ల్లాలో ఉన్నాయి. ఇక ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో, జన్నారం మండలం మంచిర్యా ల జిల్లాలో ఉన్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని నార్నూర్, గాది గూడ మండలాల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి.
ఒకే మండలం.. ఇద్దరు ఎమ్మెల్యేలు
మరోవైపు ఒకే మండలంలోని గ్రామాలు రెండు నియోజకవర్గాల్లో ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో పాలనలో ఇబ్బందులు వస్తున్నాయి. నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) రెండు నియోజకవర్గాల్లో ఉంది. ము థోల్ నియోజకవర్గంలో నర్సాపూర్(జీ), గొల్లమాడ, చా క్పల్లి, నందన్, బామ్ని బీ, బూర్గుపల్లి(జీ), తిమ్మాపూర్(జీ), అర్లి(కే), తూరాటి గ్రామాలు ఉన్నాయి. నిర్మల్ పరిధిలో తెంబరేని, రాంపూర్, నర్సాపూర్(జీ), కుస్లీ, అంజనీతండా గ్రామాలు ఉన్నాయి. అంతేగాక, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోనూ మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం శాలిగాం, మాడవెల్లి, భీమిని మండలం కేస్లాపూర్, చిన్నగుడిపేట, చిన్నతిమ్మాపూర్ గ్రామాలు ఉన్నాయి. ఈ రెండు మండలాల్లోని మిగతా గ్రామాలు బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో ఉంటాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం బోథ్ నియోజకవర్గ పరిధిలో సిరికొండ, సుగిండి, పొన్న, సొంపల్లి, రాయిగూడ, నేరడిగొండ(జి), నారాయణపూర్, జెండాగూడ, కుంటగూడ గ్రామాలున్నాయి. ఇదే మండలం ఖానాపూర్లో వాయిపేట, ఫకీర్నాయక్తండా, ధర్మసాగర్, రిమ్మా, లక్ష్మీపూర్, లక్ష్మీపూర్(కే), కొండాపూర్, రాంపూర్, కన్నాపూర్, పోచంపల్లి గ్రామాలు ఉన్నాయి. దీంతో ఒకే మండలంలో ఇద్దరు ఎమ్మెల్యేలు తమ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పర్యవేక్షించాల్సి వస్తోంది.
డీలిమిటేషన్తో తీరేనా?
2026లో నూతన జనగణన తర్వాత కేంద్రం డీలిమిటేషన్ ఏర్పాటు చేస్తే ఉమ్మడి జిల్లాలో కొత్తగా నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఒకే జిల్లాలో, పూర్తి నియోజకవర్గంగా ఏ ర్పాటు చేస్తే ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తీరే అవకాశం ఉంది. ఈలోపు రా ష్ట్ర ప్రభుత్వం సైతం జిల్లాల పునర్విభజన కోసం ఓ కమిటీ వేసి శాసీ్త్రయంగా సరిహద్దులు ఏర్పాటు చేస్తామంటున్న తరుణంలో భౌగోళిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలను దృష్టిలో పెట్టుకుని విభజన చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పాలనలో ఇబ్బందులే..
అభివృద్ధి పనులు, నిధుల ఖర్చు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగానే జరుగుతుంటాయి. అయితే ఆయా మండలాలు వేర్వేరు జిల్లాల్లో ఉండడంతో ఎమ్మెల్యేలకు ఆ గ్రామాల్లో నిధుల ఖర్చు, ఎంపికలో ఇబ్బందులు వస్తున్నాయి. మరోవైపు ఒకే మండలం వేర్వేరు గ్రామాలు ఉండడంతోనూ ఇద్దరు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది. నియోజకవర్గాలు ఓ వైపు, జిల్లా మరోవైపు ఉండడంతోనూ పర్యవేక్షణ పట్టుతప్పుతోంది. ఎమ్మెల్యేలు జెడ్పీ సమావేశాలు, ఆయా జిల్లాల సమీక్షలు, సమావేశాలకు దూరంగానే ఉంటున్నారు. ఒక మండలం ఒకే నియోజకవర్గంలో లేకపోవడంతో నిధుల ఖర్చు, అర్హుల ఎంపికలోనూ పలు గ్రామాలపై ప్రభావం చూపుతోంది.
ఉమ్మడి జిల్లాలో కొత్త మండలాల డిమాండ్లు ఉన్నాయి. బోథ్, చెన్నూరు, డివిజన్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. చెన్నూరు నియోజవర్గంలో కొత్తగా పారుపల్లి, ఆస్నాద మండలాలు ఏర్పాటు చేయాలని, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలాన్ని అర్బన్, రూరల్, నిర్మల్ జిల్లా కుభీరు, తానూరులో బేల్తరోడా, మాలేగం, మామడ మండలం పొనకల్, సారంగాపూర్ మండలం బీరవెల్లి మండలాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


