పండుగ వేళ ‘శిక్ష’ణ..!
కేజీబీవీ ఎస్వో, కేర్టేకర్లకు రెసిడెన్షియల్ తరహా శిక్షణ ఈ నెల 7 నుంచి 11వరకు.. ఐదు రోజులూ అక్కడే బస టీచర్ల సంఘాల అభ్యంతరం
మంచిర్యాలఅర్బన్: కేజీబీవీ ప్రత్యేక అధికారులు, మోడల్ స్కూల్ అనుబంధ వసతిగృహాల కేర్టేకర్ల కు ‘సాధికారపర్చటం’ అనే అంశంపై శిక్షణ ఇవ్వనున్నారు. మంచిర్యాల జిల్లాలో 18 కేజీబీవీలు, నాలు గు మోడల్ హాస్టళ్లు, నిర్మల్ జిల్లాలో 18 కేజీబీవీలు, ఒక మోడల్ హాస్టల్కు చెందిన ప్రత్యేక అధికారులు, కేర్టేకర్లు కం వార్డెన్లకు ఈ నెల 7నుంచి 11వరకు స్పెల్–1 రెసిడెన్షియల్ తరహా శిక్షణ ప్రారంభం కానుంది. రెండు జిల్లాలకు చెందిన వారందరికీ జిల్లా కేంద్రం మంచిర్యాలలోని ప్రైవేటు హోటల్లో ఐదు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఏ ఒక్కరికీ ఇంటికి వెళ్లడానికి అనుమతి లేదని ఆదేశాలు జారీ అయ్యాయి. లాడ్జింగ్, బోర్డింగ్తోపాటు అన్ని వసతులు కల్పించే శిక్షణకు సంసిద్ధులు కావాలని సూ చించారు. మాస్టర్ ట్రైనర్లతో సహా పాల్గొనే వారందరికీ వసతి, ఆహార సౌకర్యాలు కల్పిస్తారు. పీపీటీ ప్రజెంటేషన్ల కోసం డిజిటల్ స్క్రీన్, ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన 50మంది పాల్గొనే సీటింగ్ సామర్థ్యంతో కూడిన శిక్షణ వేదికను గుర్తించాలని ఆదేశాలు వచ్చాయి. ఒకరోజు ఆచరణాత్మక సెషన్, కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి 25 కంప్యూటర్లతో కూడిన ఐసీటీ ల్యాబ్ సౌకర్యాలు, అవసరమైన స్టేషనరీతో సహా శిక్షణ పరికరాలు ఏర్పాటు చేసుకోనున్నారు. ఈ నెల 7న మాస్టర్ ట్రైనర్లు, మోడల్ స్కూల్కు అనుబంధ హాస్టళ్ల కేర్టేకర్లు కం వార్డెన్లు శిక్షణ కార్యక్రమానికి ఉదయం 9గంటలకు ముందే చేరుకోవాలని సూచించారు.
అభ్యంతరాలు
ఈ నెల 10 నుంచి 16వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. కేజీబీవీ, మోడల్ అనుబంధ హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఇళ్లకు వెళ్లే ముందు వివరాల నమోదు, కుటుంబ సభ్యులకు అప్పగించడం తదితర విషయాలెన్నో పర్యవేక్షించడం ఎస్వోలు, కేర్టేకర్లదే బాధ్యత. మరోవైపు ఇతర ప్రాంతాల్లో ఉన్నత చదువులకు వెళ్లిన తమ పిల్లలు కూడా స్వగ్రామాలకు రావడం, పిండివంటలు చేసుకోకుండా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల విధులు, ఇతరత్రా బోధనేతర పనులతో సతమతం అవుతుండగా ఐదు రోజులపాటు రెసిడెన్షియల్ తరహా శిక్షణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం మంచిర్యాల జిల్లా వారైనా ఇంటికి వెళ్లి శిక్షణకు హాజరయ్యేలా నిబంధనలు విధిస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాయిదా వేయాలి
కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, మోడల్ హాస్టల్ కేర్టేకర్ల శిక్షణ తాత్కాలికంగా వాయిదా వేయాలి. పండుగ వేళ శిక్షణ సరికాదు. మొదటి ఫేజ్ శిక్షణను సంక్రాంతి పండుగ తర్వాత చేపట్టాలి. పీఆర్టీయూ తెలంగాణ పక్షాన ఈ విషయంలో ఉన్నతాధికారులతో చర్చించనున్నాం. – గంగాధర్, జిల్లా
ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ తెలంగాణ
సంక్రాంతి తర్వాత ఏర్పాటు చేయాలి
ప్రతీ ఇంట్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటారు. కేజీబీవీ ఎస్వోలు, కేర్టేకర్లు అందరూ మహిళా టీచర్లే. ఇంట్లో సెలవులకు పిల్ల లు, బంధువులు వచ్చే వేళ పిండివంటలు చేసుకోవడం ఆనవాయితీ. పండుగ తర్వాత శిక్షణ ఇస్తే సక్రమంగా జరగడంతోపాటు పండుగ కూడా సంతోషంగా జరుపుకునే వీలుంటుంది.
– రాజావేణు,
జిల్లా ప్రధాన కార్యదర్శి టీఎస్యూటీఎఫ్


