మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో శనివారం ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్గౌడ్, ఎల్.రవికుమార్ మాట్లాడుతూ ఎంపికలకు దాదాపు 160మందికి క్రీడాకారులు హాజరయ్యారు. అండర్–11, 13, 15, 17, 19 బాలబాలికలు, పురుషులు, మహిళలు, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలకు ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. నిరంతరం సాధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. జిల్లా క్రీడాకారులు షటిల్ బ్యాడ్మింటన్లో జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపికల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి మెమోంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్ఖాన్, ప్రవీణ్, సీనియర్ క్రీడాకారుడు సయ్యద్ ఎజాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు.


