ధరూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశానికి గురైన వివాహిత బావిలో దూకి మృతిచెందిన ఘటన మండలంలోని అల్వాల్పాడులో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకట్రెడ్డి, పద్మమ్మ(48)దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద వాడైన వంశీ యాప్ లోన్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో యాప్ల ద్వారా లోన్లు తీసుకుని అప్పుల పాలవుతున్నారని భావించి ఇంట్లో తల్లి మందిలించింది. ఈ క్రమంలో పద్మమ్మ అత్త కలుగజేసుకుని నీవు నెత్తికెక్కించుకోవడం వల్లే వాడిలా తయారయ్యాడు.. అంతా నీవల్లే అంటూ మందలించడంతో క్షణికావేశానికి లోనై గురువారం సాయంత్రం 5:30 గంటల సమయంలో వ్యవసాయ బావికి వెళ్లి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటంబ సభ్యులు అటూఇటు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం ఉదయం సొంత బావి వద్ద ఆమె చెప్పులు కనిపించడంతో అనుమానంతో బావిలో గాలించారు. పెద్ద ఎత్తున నీళ్లు ఉండడంతో గజ ఈతగాళ్లతో గాలించినా ఫలితం లేకపోయింది. నాలుగు మోటార్లు, ఒక ఫైరింజన్ మోటారు సహాయంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీటిని తోడేశారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో మృతదేహం బయటకు తీశారు. పంచనామా నిర్వహించిన పోలీసులు శవాన్ని గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ హుస్సేన్ తెలిపారు.


