ప్రాజెక్టు అలుగు పారుతున్నా కాల్వలో పారని నీరు
● గువ్వలోనిపల్లి సమీపంలో
పూడుకుపోయిన మట్టి కాల్వ
● సాగునీరు వృథా అవుతున్నా
పట్టించుకోని వైనం
● ఆందోళన చెందుతున్న
ఆయకట్టు రైతులు
కుడి కాల్వ పనులు నాసిరకంగా చేపట్టారు. తీగలకుంట కింద సిమెంట్ కాల్వ ఎత్తు తక్కువగా ఉండడంతో నీరు పై నుంచి పారుతోంది. గువ్వలోనిపల్లి సమీపంలో కాల్వ సరిగా లేకపోవడంతో నీరు ముందుకెళ్లడం లేదు. దాదాపుగా పదిహేనేళ్ల క్రితం తీసిన కుడి కాల్వ కింద ఇప్పటివరకు ఒక్క పంట సరిగా పండించుకోలేదు. కాల్వలో మొత్తం చెట్లు పెరిగాయి. మరమ్మతు చేసే వారే కరువయ్యారు. ఒక పక్క డిండి ప్రాజెక్టు అలుగు పారుతున్నా మాకు మాత్రం సాగునీరు అందడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి రైతుల కష్టాలు తీర్చాలి.
– వడ్డె బాల్రాం,
ఆయకట్టు రైతు, వడ్డెర గుడిసెలు
●
ఉప్పునుంతల: జిల్లా సరిహద్దులోని డిండి ప్రాజెక్టు ఆరు నెలల నుంచి అలుగుపారుతున్నా.. అధికారుల అలసత్వంతో కుడి కాల్వ వెంట సాగునీరు అందక మండలంలోని లత్తీపూర్, వడ్డెర గుడిసెలు, గువ్వలోనిపల్లికి చెందిన ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా పదిహేనేళ్ల క్రితం కుడి కాల్వ తవ్వినా ఇప్పటివరకు ఆయకట్టు కింద ఒక్క పంట కూడా పండలేదు. సాగునీటి కాల్వను నల్గొండకు చెందిన అధికారులు పర్యవేక్షిస్తుండడంతో వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తమ సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులకు వివరించినా ఫలితం లేకపోవడంతో సాగునీటిపై రైతులు పెట్టుకున్న ఆశలు అందని ద్రాక్షగా మారుతున్నాయి.


