మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలో ‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఇన్చార్జి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి క్రమం తప్పకుండా ఇంజినీర్లు వెళ్లి ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి రోజువారీ నివేదికలు సమర్పించాలన్నారు. ఎక్కడైనా ఈ పనులు ఆగిపోతే వెంటనే లబ్ధిదారులను కలిసి చైతన్యపరచాలన్నారు. స్లాబ్ స్థాయికి చేరుకున్న చోట పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో ఏఈలతో అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు 10,555 ‘ఇందిరమ్మ’ ఇళ్లు మంజూరు కాగా 7,898 కి మార్కింగ్ వేశారని వారు వివరించారు. మిగిలినవి ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులు త్వరగా పనులు ఆరంభించేలా చూడాలని ఆయన సూచించారు. ఇసుకతో పాటు ఇతర సామగ్రి కొరత ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా ఇసుక సరఫరా సులభతరం చేస్తామన్నారు.
వచ్చే నెలలో
1,300 ఇళ్లు పూర్తి కావాలి
ఇక ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికశ్రీలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు కనీసం 1,300 గృహ ప్రవేశాలు అయ్యేలా చూడాలన్నారు. వచ్చే జూన్ 2 నాటికి మిగిలిన ఇళ్లు సైతం పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా 21వ స్థానంలో ఉందని, వచ్చే జూన్ 2 నాటికి టాప్ 5లోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇకపై ప్రతిరోజూ ఏఈలు, ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులతో సమీక్షించి ఇళ్ల పురోగతిని పర్యవేక్షిస్తామన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ వెంకట ఉపేందర్ రెడ్డితో పాటు డీఈఈలు పాల్గొన్నారు.


