కల్వకుర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం 25 మార్చి 2025లో ప్రవేశపెట్టిన వాలిడేషన్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, అది దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని కోటి 80 లక్షల రిటైర్డ్ ఉద్యోగులకు గొడ్డలి పెట్టని ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం లోక్భలో ప్రవేశపెట్టిన ఈ చట్టం వల్ల 1 జనవరి 2026 కంటే ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వేతన సవరణ చట్టం, ఇతర బెనిఫిట్స్ ఏవీ లభించవన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క రిటైర్డ్ ఉద్యోగి గళం విప్పి కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులలో విభజన తెచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. మార్చి 25న రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులందరూ మండల కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రాలు అందించాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణయ్య, సుధాకర్, పెంటయ్య, నిర్మల, రామారావు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.


