● గతేడాది వేతనాలకు రూ.13 కోట్లు, ఈసారి రూ.20 కోట్లు
● కొత్త ఇంజినీరింగ్, లా కళాశాలల ఏర్పాటు, సిబ్బందికి వేతనాలతో పెరిగిన బడ్జెట్
● అభివృద్ధి పనుల కోసం రూ.25 కోట్లు కేటాయింపు
ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని స్వాగతిస్తున్నాం..
ఉద్యోగులు పెన్షనర్లు, ఆరోగ్య పథకానికి రూ.1,056 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నాం. దీని ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబంపై ఆధారపడిన వారికి డిజిటల్ హెల్త్కార్డుల ద్వారా నగదు రహిత వైద్యం చేయడం మంచి విషయం. అయితే రెండో పీఆర్సీ, అదనపు నిధులు, అనుకున స్థాయిలో విద్యారంగానికి నిధులు కేటాయించకపోవడం, పెంచిన నిధుల్లో మధ్యాహ్న భోజనం, బ్రేక్ ఫాస్ట్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు వంటి వాటికే సరిపోయే అవకాశం ఉంది. పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధులు అనుకున్న స్థాయిలో కేటాయించలేదు.
– జుర్రు నారాయణ,
తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు
వ్యవసాయ రంగానికి అనుకూలం..
గ్రామీణ ప్రాంత వారిని ఆకట్టుకునేలా బడ్జెట్ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామం. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నా ప్రాజెక్టులకు కొత్తగా ఏమీ కేటాయించలేదు. పాఠశాల విద్య మినహాయిస్తే యూనివర్సిటీ లు, ఉన్నత విద్యకు అనుకున్న స్థాయిలో ని ధులు లేవు. వైద్యరంగానికి ఆరోగ్యశ్రీకి కూ డా అనుకున్న స్థాయిలో నిధులు లేవు. మొ త్తంగా ప్రాంతీయ ఎన్నికలను దృష్టిలో పెట్టు కుని బడ్జెట్ కేటాయించినట్లు అనిపిస్తుంది.
– డాక్టర్ గడ్డం జిమ్మీకార్టన్, మాజీ
విభాగాధిపతి, ఎకనామిక్స్, పీయూ
విద్యారంగానికి మొండిచేయి..
ప్రభుత్వం విద్యారంగానికి ఈసారి కూడా మొండిచేయి చూపించింది. రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం రూ.26 వేల కోట్లు (8.22 శాతం) మాత్రమే కేటాయించారు. కొఠారీ కమిషన్ నివేదిక ప్రకా రం విద్యకు కనీసం 30 శాతం బడ్జెట్లో నిదులు కేటాయించాలి. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి వాటికి అదనపు నిధులు లేవు.
– భరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూకు ప్రభుత్వం గత రెండేళ్లుగా స్థిరంగా బడ్జెట్ కేటాయిస్తోంది. ఈసారి సిబ్బందికి వేతనాలు పెంచేందుకు మరిన్ని నిధులు వెచ్చించింది. గతేడాది కేవలం టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది కోసం రూ.13 కోట్లు మాత్రమే కేటాయించింది. గత కొన్నేళ్లుగా ఇదే బడ్జెట్ వెచ్చిస్తూ వచ్చిన ప్రభుత్వం ఈసారి ఏకంగా రూ.7 కోట్లు అధికంగా కేటాయించారు. ఇందులో ప్రధానంగా పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయడంతో అక్కడ పనిచేస్తున్న టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందికి వేతనాలు ఇవ్వాల్సి ఉంది. వచ్చే విద్యా సంవత్సరంలో రెండు కళాశాలలు సెకండ్ ఇయర్లోకి అడుగు పెట్టనున్న క్రమంలో సిబ్బంది సంఖ్య కూడా మరింత పెరగనుంది. అలాగే పీయూతోపాటు గద్వాల, కొల్లాపూర్, వనపర్తి పీజీ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఈసారి అధికారులు 12 శాతం వేతనాలు పెంచగా.. వచ్చే సంవత్సరం కూడా మరో 12 శాతం ఈ నిధుల నుంచి కేటాయించనున్నారు. రెగ్యులర్ సిబ్బందికి ఇంక్రిమెంట్ తదితరాలు ఇచ్చేందుకు ఈ నిధుల నుంచే వెచ్చించనున్నారు. వీటితోపాటు యూనివర్సిటీలో జరుగుతున్న అభివృద్ది పనుల కోసం రూ.25 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పీయూలో కొత్తగా నిర్మిస్తున్న లా, ఇంజినీరింగ్ కళాశాలలు, హాస్టల్ భవనాలతోపాటు ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు బడ్జెట్లో వెచ్చించిన నిధులు ఖర్చు చేయనున్నారు.
వేతనాలు పెంచనున్నాం..
ప్రభుత్వం గతేడాదితో పోల్చితే ఈసారి వేతనాలకు కేటాయించే బడ్జెట్ పెంచింది. గతంలో రూ.13 కోట్లు ఉండగా.. ఈసారి రూ.7 కోట్లు పెంచి రూ.20 కోట్లు ఇచ్చింది. దీంతో లా, ఇంజినీరింగ్ కళాశాలల సిబ్బందికి వేతనాలు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా వేతనాలు పెంచనున్నాం. వీటితోపాటు అభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయించారు. దీంతో పీయూలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, అభివృద్ధి చేస్తాం.
– జీఎన్ శ్రీనివాస్, వీసీ, పీయూ
ప్రగతికి బాటలు..
రాష్ట్ర బడ్జెట్ ప్రగతికి బాటలు వేసే విధంగా ఉంది. ఉమ్మడి జిల్లాలోని రైతాంగానికి, పేదలకు, ఉద్యోగులకు కొండంత అండగా నిలిచేలా నిధుల కేటాయింపులు జరిగాయి. ఇది ఇందిరమ్మ రాజ్యానికి అసలైన పునాది. కేవలం అంకెలు మాత్రమే కాదు.. సామాన్యుడి ఆశలను ప్రతిబింబించే బడ్జెట్ ఇది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయం. రైతుభరోసా, రైతు రుణమాఫీతో పాటు సాగునీటి రంగానికి, విద్యుత్ సబ్సిడీలకు భారీ కేటాయింపులు చేయడం రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుతోంది.
– సంజీవ్ ముదిరాజ్, డీసీసీ అధ్యక్షుడు, మహబూబ్నగర్
బీసీలను మోసం చేసేలా..
బీసీలను మోసం చేసేలా బడ్జెట్ ఉంది. 56శాతం ఉన్న బీసీలకు కేవలం 4శాతం నిధులు రూ. 12,500 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు కూడా ఖర్చు చేస్తారన్న నమ్మకం లేదు. గత బడ్జెట్లో బీసీల సంక్షేమానికి కేటాయించిన నిధులే ఖర్చు చేయలేదు. ప్రతి సంవత్సరం బీసీ సంక్షేమానికి రూ. 20వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన మాటాలు గాలి మాటలే అయ్యాయి. బీసీలను ఈ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. గత బడ్జెట్లోని అంకెలే ఈ బడ్జెట్లో ెపెట్టారు. 6 గ్యారంటీల ప్రస్తావనే లేదు. మొత్తంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను గాలి బడ్జెట్గా చెప్పవచ్చు. – శ్రీనివాస్గౌడ్, మాజీ మంత్రి, మహబూబ్నగర్


