● ఆలయాల్లో పంచాంగ శ్రవణం
● అలరించిన కవి సమ్మేళనాలు
స్టేషన్ మహబూబ్నగర్/మహబూబ్నగర్ మున్సిపాలిటీ/చిన్నచింతకుంట: శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరాదికి జిల్లా ప్రజలు సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉగాది వేడుకలను గురువారం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా వ్యాపార సంస్థల్లో, ఇళ్లలో విశేష పూజలు నిర్వహించారు. పలు చోట్ల నిర్వహించిన కవి సమ్మేళనాలు అలరించాయి. జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, టీడీ గుట్ట తిరుమలనాథుని ఆలయం, శ్రీనివాసకాలనీ పంచముఖాంజనేయస్వామి, టీచర్స్ కాలనీ రామాలయం, బ్రాహ్మణవాడిలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, పద్మావతి కాలనీ కాళికాలయం, వేంకటేశ్వర కాలనీ రాజరాజేశ్వరి ఆలయాల్లో దేవతామూర్తులకు విశేష అభిషేకాలు, అలంకరణ పూజలు చేశారు. పలు ఆలయాల్లో ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు.


