● జిల్లాలో 51 వేల పశువులకు టీకాలు లక్ష్యం
● నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్
మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాలో పశువుల ఆరోగ్య పరిరక్షణకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పశువులలో వేగంగా వ్యాపించే గాలికుంటు వ్యాధిని నియంత్రించేందుకు జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లోని పశువులకు ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించారు. జిల్లాలోని పశువైద్య సిబ్బందిని 51 బృందాలుగా ఏర్పాటు చేశారు. సుమారు 51 వేల పశువులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్గౌడ్ తెలిపారు. టీకాల కార్యక్రమం మార్చి 10 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు కొనసాగనుంది.
● జిల్లాలోని 17 మండలాల్లో పశువైద్య బృందాలు గ్రామాలకు వెళ్లి ఆవులు, ఎద్దులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నారు. ఈ వ్యాధి కారణంగా పశువుల పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు రైతులకు ఆర్థిక నష్టం కలుగుతుందని అధికారులు తెలిపారు. అందుకే ముందస్తు జాగ్రత్తగా టీకాలు వేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పశువులకు జ్వరం రావడం, నోరు, కాళ్ల వద్ద పుండ్లు ఏర్పడడం, తినలేకపోవడం వంటి లక్షణాలు గాలికుంటు వ్యాఽధి సంకేతాలని పశువైద్యులు తెలిపారు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప పశువైద్యశాలను సంప్రదించాలని రైతులకు సూచించారు.


