
జూరాలకు పెరిగిన ఇన్ఫ్లో
గద్వాల/ఆత్మకూర్: జూరాలకు ఎగువ ప్రాంతాలైన మహరాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతుంది. మంగళవారం జూరాలకు 1.33 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి 1.12 లక్షల క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 37,206 క్యూసెక్కుల నిటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.83 టీఎంసీల నిల్వ ఉంది. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులైన నెట్టెంపాడు, భీమా లిఫ్ట్–1, 2, కోయిల్సాగర్, ఆర్డీఎస్, సమాంతర కాల్వలకు నీటిని పూర్తిగా నిలిపివేశారు. జూరాల ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జోరుగా విద్యుదుత్పత్తి
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ కేంద్రాల్లో మంగళవారం 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపడుతున్నారు.
శ్రీశైలం ఆరు గేట్లు ఎత్తివేత
దోమలపెంట: జూరాలలో ఆనకట్ట స్పిల్వే ద్వారా 77,462, విద్యుదుత్పత్తి చేస్తూ 37,206, సుంకేసుల నుంచి 8,892, హంద్రీ నుంచి 250 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,23,810 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. శ్రీశైలంలో ఆనకట్ట వద్ద ఆరు గేట్లు ఒకొక్కటి పది అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా 1.68 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన సాగర్కు విడుదల చేస్తున్నారు. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 30,325 మొత్తం 65,640 క్యూసెక్కుల నీటిని అదనంగా సాగర్కు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.9 అడుగుల వద్ద 215.3263 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5 వేలు, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,830, ఎంజీకేఎల్ఐకు 642 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.107 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 14.350 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టారు.
1.33లక్షల క్యూసెక్కుల వరద
11 గేట్లు ఎత్తివేత
శ్రీశైలానికి 1.12 లక్షల క్యూసెక్కులు విడుదల