
లోక్ అదాలత్లో 24,713 కేసులు రాజీ
పాలమూరు: లోక్ అదాలత్లో కేసులు రాజీ కావడం వల్ల హైకోర్టుకు మళ్లీ అప్పీల్ వెళ్లడానికి అవకాశం ఉండదని, ఇలా చేయడం వల్ల ఇరువురు కక్ష్యిదారులు గెలుస్తారని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రధాన కోర్టులో శనివారం ఏర్పాటు చేసి జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో భారీ స్థాయిలో కేసులు రాజీ అయ్యాయని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కోర్టులో ఐదు బెంచీలు, జడ్చర్ల కోర్టులో రెండు బెంచీలు ఏర్పాటు చేసి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించగా.. మొత్తం 24,713 కేసులు రాజీ అయ్యాయన్నారు. 2024లో జరిగిన రోడ్డు ప్రమాద కేసులో నష్టపరిహారం కింద న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కక్ష్యిదారుడికి రూ.33 లక్షల చెక్కను ప్రధాన న్యాయమూర్తి అందించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీదేవి, రాజరాజేశ్వరి, ఈశ్వరయ్య, రాధిక, మహ్మద్ మునావర్ హుస్సేన్, రవిశంకర్, కె.భావన, నిర్మల, శశిధర్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ శాఖలో 3,177 కేసులు
లోక్ అదాలత్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 3,177 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో పలు రకాల ఐపీసీ కేసులు 436, డ్రంకెన్ డ్రైవ్, ఎంవీఐ యాక్ట్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 883, ఈ–పెటీ, బహిరంగ మద్యం కేసులు 1,858 కేసులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ జానకి మాట్లాడుతూ కేసుల పరిష్కారం కోసం కృషి చేసిన కోర్టు కానిస్టేబుళ్లు, అధికారులకు త్వరలో రివార్డ్స్ అందజేస్తామన్నారు.