
బడీడు పిల్లలు బడిలోనే ఉండాలి
నవాబుపేట: బడీడు పిల్లలంతా బడిలోనే ఉండాలని, అలాగే బాలికలు మధ్యలో డ్రాపౌట్ కాకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆర్జేడీ విజయలక్ష్మి అన్నారు. సోమవారం మండలంలో జరుగుతున్న బడిబాట కార్యక్రమాన్ని ఆమె డీఈఓ ప్రవీణ్కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ రకాల కారణాలు చెప్పి వలస వెళ్లిన వారంతా ఎక్కడో ఒకచోట విధిగా బడిలో చేరాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థులకు అందించాల్సిన యూనిఫాంలు సిద్ధం చేయాలని, మహిళా సంఘాలు క్లస్టర్ల వారిగా వాటిని ఏర్పాటు చేసి పాఠశాలలకు అందించాలన్నారు. గ్రామాల్లో ఉపాధ్యాయ, సిబ్బంది బడిబాటను మొక్కుబడిగా కాకుండా బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంపై ప్రతిరోజు రాష్ట్ర, జిల్లాస్థాయిలో పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో నవాబుపేటలో గతేడాది బడి మానేసిన బాలిక అనూషను తల్లిదండ్రులతో మాట్లాడి బడిలో చేర్పించారు. అలాగే కేజీబీవీ విద్యార్థులకు ఇవ్వాల్సిన యూనిఫాంలను ప్రిన్సిపల్కు అందజేశారు. అనంతరం నవాబుపేటలో అధికారులు, ఉపాధ్యాయులతో కలిసి బడిబాట ప్ర తిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సీఎంఓ బాలునాయక్, ఎంపీడీఓ జయరాంనాయక్, ఎంఈఓ నాగ్యనాయక్, సీఆర్పీ జనార్దన్, కేజీవీవీ ప్రత్యేకాధికారి మాధవి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.