
ప్రతిష్టాత్మకంగా టీజీపీఈసెట్ నిర్వహణ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ బీపెడ్, డీపెడ్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న టీజీపీఈ సెట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. సోమవారం పీయూ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్షను నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం పీయూకు మొదటిసారి అప్పగించిందని, దీనిని విజయవంతంగా నిర్వహిస్తే భవిష్యత్లో మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ఈ నెల 11 నుంచి 14 వరకు పీయూలో నిర్వహించే ఈవెంట్స్కు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 11న ఉదయం 7 గంటలకు ఈవెంట్స్ను రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి హాజరై ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,700 సీట్లు ఉండగా.. 2,557 మంది దరఖాస్తు చేశారన్నారు. ఇందులో 1,496 మంది బాలురు కాగా.. 1,061 మంది బాలికలు ఉన్నారన్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ఈవెంట్లో పాల్గొనే విద్యార్థులకు వైద్యసేవలు అందించేందుకు వైద్యులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఈవెంట్స్కు హాజరయ్యే విద్యార్థులకు ఆన్లైన్లో హాల్టికెట్లు అందుబాటులో ఉన్నాయని, వాటి ఆధారంగా కేటాయించిన తేదీల్లో విద్యార్థులు ఈవెంట్స్కు హాజరుకావాలని కోరారు. సమావేశంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, సెట్ కన్వీనర్ దిలీప్, పీయూ ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్, పీఆర్వో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.