
కాళేశ్వరం కమిషన్ విచారణ త్వరగా పూర్తి చేయాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: రాష్ట్ర మంత్రులు సమష్టిగా పనిచేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనేందుకు జిల్లాకేంద్రానికి వచ్చిన ఆయన బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడకపోతే పథకాలు పెట్టినా ప్రయోజనం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద తప్పుల మీద తప్పులు చేసిందని ఆరోపించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నీళ్లు రావడం లేదన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణను త్వరితగతిన పూర్తి చేసి ప్రాజెక్టు భవితవ్యాన్ని తేల్చాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి రూ.10 వేల కోట్లు విద్యుత్ చార్జీలకు, మరో రూ.10 వేల కోట్లు అప్పులకు చెల్లించే పరిస్థితుల నుంచి బయటపడాలన్నారు. ఎక్కువ ఊహించుకొని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును, పెండింగ్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.ఉద్యోగ క్యాలెండర్ మాదిరి ప్రాజెక్టుల పూర్తికి క్యాలెండర్ విడుదల చేయాలని అన్నారు. వందేళ్ల పార్టీ సీపీఐ మాత్రమేనన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను చంపడం సరికాదన్నారు. సంబాల కేశవరావును చంపిన తర్వాత దేశంలోని కోట్లాది మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వ చర్యను వ్యతిరేకించారన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు ప్రభుత్వాలు పనిచేయడం సరికాదన్నారు.
మార్క్సిజం, లెనినిజం ద్వారానే
పేదల బతుకుల్లో వెలుగులు..
భరత గడ్డ విముక్తి పోరులో భారత కమ్యూనిస్టు పార్టీ నడిపిన వీరోచిత కమ్యూనిస్టు ఉద్యమం చరిత్రాత్మకమని, కమ్యూనిజాన్ని అంతం చేయాలనుకుంటే కాలి బూడిదైపోతారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సీపీఐ కార్యాలయం నుంచి తెలంగాణ చౌరస్తా, అశోక్టాకీస్ చౌరస్తా మీదుగా వందలాది మంది ప్రజలు, కార్మికులు, సీపీఐ శ్రేణులతో అల్మాస్ ఫంక్షన్ హాలు వరకు ఎర్రజెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అల్మాస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన శతాబ్దిఉత్సవాల సభలో కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీలో తుదిశ్వాస వరకు సొంత ఆస్తులు పంచుతూ జైలు నిర్బంధాలను, అక్రమ కేసులను లెక్కచేయకుండా ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడని నైజం కమ్యూనిస్టులేదే అన్నారు. శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని 2026 డిసెంబర్ 26న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, ఆనంద్, పరమేశ్గౌడ్, ఉసేనయ్య, నరేందర్రెడ్డి, సురేశ్, రాము పాల్గొన్నారు.
మంత్రులు సమష్టిగా పనిచేసి ఆర్థిక
సంక్షోభం నుంచి బయటపడేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు