మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెమిస్టర్– 1, 3 సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు సెమిస్టర్–1లో 37.74 శాతం, సెమిస్టర్–3లో 42.11 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ తెలిపారు. ఫలితాలను పీయూ అధికార వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అడిషనల్ కంట్రోలర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.
వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వార్షిక పరీక్ష
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందిన 16వ బ్యాచ్ 86 మంది అభ్యర్థులకు హైదరాబాద్ సెట్విన్ ఆధ్వర్యంలో గురువారం వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు థియరీ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలను జిల్లా యు వజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్, ఇతర అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా డీవైఎస్ఓ మాట్లాడుతూ 16వ బ్యాచ్కు సంబంధించి ఫిబ్రవరి 2 నుంచి మే 16 వరకు 86 మంది యువతకు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సెట్విన్ వారిచే సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. వార్షిక పరీక్షలను ఎగ్జామినర్లు హైదరాబాద్ సెట్విన్ కోఆర్డినేటర్ సత్యనారాయణరెడ్డి, అసిమ్, బిల్ఖిస్ సుల్తానా పర్యవేక్షించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రవీందర్రెడ్డి, ఫ్యాకల్టీ సిబ్బంది హరిప్రసాద్, కౌసల్య, ఖలీల్, ఇమ్రాన్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.
అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి ఆసక్తి గల నూతన, రిటైర్డ్ గెస్టు లెక్చరర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గోవిందరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిలాసఫీ సోషియాలజీ, జీవవశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితం, సోషల్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఐసీటీ, ఆరోగ్య వ్యాయామ విద్య, విజువల్ ఫర్మామింగ్ ఆర్ట్స్లో ఒక్కొక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఈ నెల 19లోగా మెట్టుగడ్డ వద్ద ఉన్న బీఈడీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు
పాలమూరు: బాల, బాలికలను దినసరి కూలీలుగా మార్చినా.. బలవంతంగా దుకాణాలు, ఇతర కర్మాగారాల్లో పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. జిల్లాకేంద్రంలోని మాడ్రన్ హైస్కూల్లో గురువారం బాల కార్మిక చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కార్మికుల చట్టాలు, బాల్య వివాహాలు, బాలల హక్కులపై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాల్య దశలో ఉన్న పిల్లలను పాఠశాలలకు పంపించాలని సూచించారు.

ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీఫలితాలు విడుదల