
‘విభజన’ అభ్యంతరాలను పరిష్కరించాలి: ఆర్డీఎంఏ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల విభజన ప్రక్రియను పకడ్బందీగా, సజావుగా నిర్వహించాలని రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (ఆర్డీఎంఏ) జె.శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను గడువులోగా పరిష్కరించాలన్నారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తుదారులకు డివిజన్ల మార్పు, చేర్పులను వివరించాలన్నారు. అలాగే రెవెన్యూ విభాగం అధికారులు, వార్డు ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారించాలన్నారు. ఆయా వార్డులలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని సంబంధిత విభాగ అధికారులు తెలియజేయాలన్నారు. ఆస్తిపన్ను వసూళ్లతో పాటు అక్రమ కట్టడాలపై సమాచారం ఎప్పటికప్పుడు ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి
మినీ శిల్పారామం హాలులో సుమారు 400 మంది పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛ ఆటోల సిబ్బందికి ఎస్వీఎస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆర్డీఎంఏ జె.శ్రీనివాసరావు పరిశీలించారు. అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం 38వ వార్డు పరిధిలో కొనసాగుతున్న ‘వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక’ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సద్దలగుండులో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని స్థానికులతో మాట్లాడారు. తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు ఇవ్వాలన్నారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి సీజనల్ వ్యాధులు సోకవని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో ఏసీపీలు కరుణాకర్గౌడ్, జ్యోత్స్నాదేవి, ఆర్ఓ మహ్మద్ ఖాజా, శానిటరీ ఇన్స్పెక్టర్లు రవీందర్రెడ్డి, గురులింగం, వజ్రకుమార్రెడ్డి, వాణికుమారి, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ చరణ్, ఎస్బీఎం కన్సల్టెంట్ సుమీత్రాజ్, ఆర్ఐలు నర్సింహ, రమేష్, అహ్మద్షరీఫ్, ముజీబుద్దీన్, మెప్మా సీఓలు నిర్మల, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.