
అసమానతలు లేని సమాజాన్ని నిర్మిద్దాం
మహబూబ్నగర్ న్యూటౌన్: సమాజంలో వెనుకబడిన జాతులు అణచివేతకు గురవుతూనే ఉన్నాయని, అభివృద్ధికి ఇంకా ఆమడ దూరంలోనే ఉన్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. అసమానతలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసులు, భూ సమస్యలు నెల రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులు, భూ సమస్యలు, వివిధ శాఖల ద్వారా ఆయా వర్గాలకు అందుతున్న సంక్షేమ పథకాలపై కమిషన్ సభ్యులు నీలాదేవి, శంకర్, రాంబాబునాయక్, లక్ష్మీనారాయణతో కలిసి సమీక్ష నిర్వహించారు. పోలీస్ శాఖ ద్వారా నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుల గురించి ఎస్పీ జానకి వివరించారు. ఈ ఏడాది 26 కేసులు నమోదు కాగా 6 చార్జీషీట్ చేశామని, 20 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. గతేడాది 78 కేసులు నమోదైనట్లు చెప్పారు. 2014 సంవత్సరం నుంచి 2023 వరకు 530 కేసులకు గాను 90 కేసులు చార్జిషీట్ వేయలేదని, కారణాలు ఏమిటని చైర్మన్ ఆరాతీశారు. 2023– 24లో 27 అట్రాసిటీ కేసులకు సంబంధించి బాధితులకు పరిహారం చెల్లించామని, ఈ ఏడాది 71 మందికి రూ.78 లక్షలు పరిహారం చెల్లింపునకు నిధులు రావాల్సి ఉందన్నారు. సంబంధిత శాఖ రాష్ట్ర అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రితో మాట్లాడి నిధులు విడుదల చేయిస్తానని చైర్మన్ తెలిపారు. అంబేడ్కర్ విదేశీ విద్యా నిధి కింద గతేడాది ఒక అమ్మాయికి రూ.20 లక్షలు విదేశాల్లో చదువుకునేందుకు మంజూరు చేశామని ఎస్సీ అభివృద్ధి అధికారి చెప్పారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాలయ్య, రవీంద్రబాబు, లక్ష్మణ్, మోహన్లాల్, కృష్ణయ్య, హన్వాడ నాగయ్య సమస్యలను కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీఓ నవీన్, ఎస్సీ అభివృద్ధి అధికారి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
నిధులు పక్కదారి పట్టించొద్దు
చైర్మన్ బక్కి వెంటయ్య మాట్లాడుతూ జిల్లాలో జిల్లాలో ఎస్సీ, ఎస్టీల జనాభా ఎక్కువగా ఉందని, అదే స్థాయిలో వారికి లబ్ధి జరిగేలా చూడాలన్నారు. ప్రతినెల చివరి రోజున కచ్చితంగా పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలని, తహసీల్దార్, ఎస్ఐలు హాజరై ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశాల్లో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇందులో వారి వాటా గురించి అవగాహన కలిగించాలన్నారు. ప్రతి మూడు నెలలకోసారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిపి సమీక్షించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించవద్దన్నారు. ఆర్అండ్బీ, పీఆర్ కాంట్రాక్టర్లకు ఇచ్చే పనుల్లో ఎస్సీ, ఎస్టీలకు వారి స్థోమతను బట్టి చిన్నపాటి పనులు కేటాయించాలని సూచించారు. ఉన్నత ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా నకిలీ విత్తనాలు బెడద అరికట్టాలని, వ్యవసాయ, పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఎంప్లాయ్మెంట్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలలో అవకాశం కల్పించాలని జిల్లా ఉపాధి కల్పన అధికారికి సూచించారు.
పెండింగ్ కేసులు, భూ సమస్యలునెలలోగా పరిష్కరించాలి
ప్రతినెలా చివరి రోజు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య