
జడ్చర్ల కాలనీల్లో వరద నీరు
జడ్చర్ల మున్సిపాలిటీ మరోమారు జలమయమైంది. గురువారం మధ్యాహ్నం రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి ప్రధాన రోడ్డుతో పాటు పలు కాలనీల్లోకి వరదనీరు చేరింది. బాదేపల్లి పైభాగం ఊరకుంట పద్మావతి కాలనీ నుంచి వచ్చిన వరద నీరు ప్రధాన రోడ్డుపైకి చేరడంతో చిన్నపాటి చెరువును తలపించింది. మోకాలు లోతుకుపైగా నీళ్లు నిలవడంతో ఇటు సిగ్నల్గడ్డ, అటు నేతాజీ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. సిగ్నల్గడ్డ నుంచి క్రాస్రోడ్డుకు వెళ్లే దారిలో జాతీయ రహదారి–167పై శ్రీకృష్ణ ఆలయం వద్ద సైతం వరద నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలిగింది. రోడ్డుపై వ్యాపారాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్వీపీనగర్ కాలనీలో సౌరమ్మ అనే మహిళ ఇళ్లు, రాజీవ్నగర్ కాలనీలోనూ ఇళ్లు, ప్రహరీ కూలిపోయాయి. మరో ఇంటి నిర్మాణానికి వేసిన పిల్లర్లు పడిపోయాయి. ఏరియా ఆస్పత్రి ఆవరణలోనూ భారీగా వర్షపు నీరు నిలిచింది. వర్షానికి కూలిన ఇంటిని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి పరిశీలించారు.