రోటవేటర్‌ కింద పడి విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

రోటవేటర్‌ కింద పడి విద్యార్థి మృతి

Jun 12 2025 3:39 AM | Updated on Jun 12 2025 3:39 AM

రోటవే

రోటవేటర్‌ కింద పడి విద్యార్థి మృతి

కోడేరు: రోటవేటర్‌ కింద పడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలం జనుంపల్లిలో బుధవారం చోటుచేసుకున్నది. ఎస్సై గోకారి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి నాగేంద్రం ఉదయం తన కుమారుడు సాయికుమార్‌(13)ను పొలం వద్దకు తీసుకెళ్లాడు. డ్రైవర్‌ సత్యనారాయణ నాగేంద్రం పొలంలో రోటవేటర్‌తో దుక్కి దున్నుతుండగా వెనకాల ఉన్న సాయికుమార్‌ ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ రోటవేటర్‌ కింద పడి మృతిచెందాడు. నాగేంద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

రాజాపూర్‌: పరిశ్రమలో పైకప్పు షీట్‌వేస్తూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కిందపడిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బుధవారం మండలంలోని గుండ్లపొట్లపల్లిలో చోటుచేసుకున్నది. రాజాపూర్‌ ఎస్సై శివానందంగౌడ్‌ కథనం ప్రకారం.. గుండ్లపొట్లపల్లి శివారులో బిన్‌జ్రాజ్‌కవలేవ్యు పరిశ్రమలో మంగళవారం సాయంత్రం పాతసీట్స్‌ తొలగించి కొత్తసీట్స్‌ వేసి వెల్డింగ్‌ చేస్తుండగా.. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌హమీద్‌ ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. వెంటనే అక్కడే ఉన్న అతని తమ్ముడు చికిత్స నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి అబ్దుల్‌సలీం ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

తల్లితో గొడవ పడి

యువతి..

ఎర్రవల్లి: చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన సంఘటన ఇటిక్యాల పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ సుధాకర్‌ కథనం మేరకు.. మండలంలోని షాబాద్‌ గ్రామానికి చెందిన మహేశ్వరి(25)కి గతంలో వివాహం కాగా, భర్తతో విడాకులు తీసుకొని కొంత కాలంగా తల్లి పద్మమ్మతో కలిసి గ్రామంలో ఉంటోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ వెళ్లి పోటీ పరీక్షలకు చదువుకోవడం కోసం తనకు రూ.1లక్ష కావాలని ఈ నెల 2న తల్లిని కోరింది. ఆమె రెండు రోజుల్లో సమకూరుస్తానని చెప్పడంతో గొడవపడి మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూల్‌ ప్రభుత్వాసుపత్రికి ఆమెను తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందింది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

బాలికపై

లైంగికదాడికి యత్నం

పాన్‌గల్‌: ఆరేళ్ల బాలికపై లైంగికదాడికి యత్నించిన సంఘటన బుధవారం మండలంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం అన్నారం గ్రామంలో కోళ్ల షెడ్డు నిర్మాణం పనులు చేసేందుకు వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టకు చెందిన తిరుపతయ్య(65) కూలీగా పని చేస్తున్నాడు. బుధవారం షెడ్డు సమీపంలో ఓ ఇంటి ముందు ఊయల ఊగుతున్న బాలిక(6)ను మద్యం మత్తులో చేతిపట్టుకొని షెడ్డు లోపలికి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించగా బాలిక గట్టిగా అరుస్తూ కేకలు వేసింది. దీంతో పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని వృద్ధుడికి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు 100 సమాచారం ఇవ్వడంతో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, సీఐ కృష్ణ, ఎస్‌ఐ శ్రీనివాసులు గ్రామానికి చేరుకొని జరిగిన సంఘటనపై విచారణ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వృద్ధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఏడాది తర్వాత

దొరికిన బాలుడు

మిడ్జిల్‌: మండలంలోని కొత్తూర్‌ గ్రామానికి చెందిన ఎండీ సలీమా, జహంగీర్‌ దంపతుల పెద్ద కుమారుడు ఎండీ సమీర్‌ (15) గతేడాది 15 ఏప్రిల్‌ 2024న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. అదే రోజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు తెలిపారు. అదే రోజు బాలుని వివరాలు ఆన్‌లైన్‌ యాప్‌లో నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం ఆ యాప్‌ ద్వారా బాలుడు బెంగూళూర్‌లోని ఒక హాస్టల్‌లో ఉన్నాడని సమాచారం రావడంతో, ఆ బాలుని బెంగూళూర్‌ నుంచి తీసుకొచ్చి బుధవారం కుటుంబ సభ్యులకు అస్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. సంవత్సరం తర్వాత కుమారుడు ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

రోటవేటర్‌ కింద పడి విద్యార్థి మృతి 
1
1/1

రోటవేటర్‌ కింద పడి విద్యార్థి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement