
మహిళా శక్తిని వేగవంతం చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఇందిర మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా చేపట్టిన కార్యక్రమాలు వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఆమె వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయా కార్యక్రమాలను పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు సమన్వయం చేసుకుంటూ నిర్దేశించుకున్న గడువులోగా పూర్తయ్యేలా చూడాలన్నారు. మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఏకరూప దుస్తులు కుట్టు పనులు వేగంగా జరిగాయని, దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 12న పాఠశాల పునఃప్రారంభోత్సవం సందర్భంగా పండగ వాతావరణంలో పిల్లలకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. అంగన్వాడీలను బలోపేతం చేయాలని, అన్నింటిలో మౌలిక వసతులు కల్పించాలని, రాష్ట్రంలో త్వరలో 1000 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించనున్నామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఇందులో భాగంగా మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ పంప్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మహిళా సంఘాల ద్వారా రైస్మిల్స్, సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్ల స్థాపన, ఆర్టీసీకి అద్దె బస్సులు నడపడం వంటి అనేక కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర రుణాల కోసం మహిళలు పోయే దుస్థితి రాకుండా, జిల్లాలో పూర్తిస్థాయిలో నూతన మహిళా సంఘాలను తయారు చేసి మహిళలను చేర్పించాలన్నారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ గాంధీ జయంతి నాటికి పూర్తిచేయాలన్నారు. సీఎస్ కె.రామకృష్ణారావు మాట్లాడుతూ వందశాతం పిల్లలు బడుల్లో నమోదు కలిగి ఉండాలన్నారు. సమావేశంలో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఆర్డీఓ నర్సింహులు, డీఈఓ ప్రవీణ్కుమార్, మహిళాశిశు సంక్షేమ శాఖాధికారి జరీనాబేగం తదితరులు పాల్గొన్నారు.