
కోనేరులో దూకి వ్యక్తి బలవన్మరణం
మాగనూర్: భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఏఎస్ఐ మన్నన్ కథనం ప్రకారం.. మాగనూర్కు చెందిన వాకిటి పరశురాం(39) అదే గ్రామానికి చెందిన ముత్యమ్మతో 13 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో పరశురాం తాగుడుకు బానిసై భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి 10 గంటల సమయంలో తాగిన మైకంలో భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు అతడి కోసం వెతకగా ఎక్కడా కనిపించకపోవడంతో మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే స్థానిక లక్ష్మీనర్సింహస్వామి ఆలయ కోనేరులో పరశురాం మృతదేహం గుర్తించారు. ఈ మేరకు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పరశురాం భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.