మహబూబాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కోశాఽధికారి రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సాదుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సీఐటీయూ, అనుబంధ యూనియన్ల ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించాలని హైదాబాద్కు వెళ్లిన ఆశ వర్కర్లు, అంగన్వాడీలను అర్ధరాత్రి సైతం బస్సుల నుంచి దింపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 8,9వ తేదీల్లో చలో హైదరాబాద్ పిలుపునివ్వగా, దానిని భగ్నం చేసేందుకు ప్రభుత్వం పడరాని పాట్లు పడిందన్నారు. ఆశకార్యకర్తలకు కనీస వేతనం రూ.18,000 ఇవ్వాలని, పీఎఫ్ సౌకర్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రీప్రైమరీ విద్యను కొనసాగించాలన్నారు. హామీలు అమలు చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వెంకన్న, సమ్మెట రాజమౌళి, వీరన్న, నాగన్న, మల్లయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


