● గురుకులాలు, హాస్టళ్లలో పెరుగుతున్న
బాలికల మిస్సింగ్ సంఘటనలు
● ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు
● ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
సాక్షి, మహబూబాబాద్: గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో బిడ్డలకు భద్రత ఉంటుందని నమ్మిన తల్లిదండ్రుల్లో జిల్లాలో జరుగుతున్న వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎదిగే దశలో బాలికల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా కౌన్సెలింగ్, గైడెన్స్ లేకపోవడం, రక్షణగా ఉండాల్సిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రచారం జరగడంతో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మవద్దో అనే మీమాంసలో తల్లిదండ్రులు ఉన్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
16వేల మందికి పైగా బాలికలు..
జిల్లాలోని ఆశ్రమ, గురుకులాల్లో మొత్తం 16వేలకు పైగా బాలికలు చదువుకుంటూ ఆశ్రయం పొందుతున్నారు. ఇందులో ప్రధానంగా కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, జ్యోతిరావుపూలే, ఆశ్రమ, మైనార్టీ, ఎకలవ్య, ఫార్మసీ, ఇంజనీరింగ్, మెడికల్ మొదలైన కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్నారు. ఇందులో ఐదో తరగతి నుంచి డిగ్రీ, మెడిసిన్, ఫార్మసీ వరకు చదివే విద్యార్థులు ఉంటున్నారు. వీరందరూ జిల్లాలోని నలుమూలలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఉంటారు.
వరుస సంఘటనలతో ఆందోళన..
పిల్లలు బాగా చదువుకోవాలి. అందుకోసం ప్రభుత్వ ఆశ్రమాల్లో ఉంచితేనే మేలని నమ్మిన తల్లిదండ్రులను వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల నుంచి పిల్లలు బయటకు పోవడం, రోజుల తరబడి అటు ఇంటికి, ఇటు పాఠశాలలకు, కళాశాలలకు రాకుండా ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందడం, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలోనే జరిగిన పలు సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారాయి.


