● ఇన్ఫోసిస్ సీనియర్ డైరెక్టర్ రవి అప్పయ్య
హసన్పర్తి: భవిష్యత్ ప్రపంచాన్ని మలుపు తిప్పే సాంకేతికతగా కృత్రిమ మేధస్సు మారిందని, అందుకు పరిశోధకులు నైతిక విలువలతో కూడినసాంకేతిక పరిష్కారాలపై దృష్టిసారించాలని ఇన్ఫోసిస్ సీనియర్ డైరెక్టర్ రవిఅప్పయ్య అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో ఐఈఈఈ సహకారంతో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న 7వ అంతర్జాతీయ స్మార్ట్ సిస్టమ్స్ అండ్ ఇన్వెంటివ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్(ఐసీఎస్ఎఓస్ ఐటీ –2026) మంగళవారం ఎస్సార్ ఐఎక్స్ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమైంది. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రవి అప్పయ్య మాట్లాడారు. అంతర్జాతీయ విద్యాసహకారాన్ని ప్రోత్సహించడంలో ఇలాంటి సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ సదస్సుల ద్వారా పరిశోధనకులు, విద్యార్థులు పరిశ్రమ నిపుణుల మధ్య విలువైన భాగస్వామ్యాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాన్ఫరెన్స్ చైర్మన్ డాక్టర్ రవిచందర్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు, స్మార్ట్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ తదితర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు తమ పరిశోధనలను పంచుకునే అంతర్జాతీయ వేదికగా ఐసీఎస్ఎఓస్ ఐటీ రూపుదిద్దుకుందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ మహేష్, ప్రొఫెసర్ శశికళ తదితరులు పాల్గొన్నారు.


