● ఎమ్మెల్యే మురళీనాయక్,
కలెక్టర్ స్నేహశబరీష్
● మానుకోట రైతు వేదికలో విత్తన మేళా
మహబూబాబాద్ రూరల్ : భవిష్యత్ తరాల మనుగడ కోసం పంట మార్పిడి విధానం తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదికలో విత్తన మేళా ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే, కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల ప్రస్తుతం వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఎస్సారెస్పీ, ఇతర నీటి వనరులు కూడా అందుబాటులో లేనందున రైతులు ఆరుతడి పంటలు పండించాలన్నారు. ప్రతీ రైతు తనకు ఉన్న భూమిలో సాధ్యమైనంత వరకు నీటి కుంట (పంట కుంట)ను ఏర్పాటు చేసుకోవాలని తద్వారా నీటి వనరులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలను వేసుకుని రైతులు అధిక లాభాలు పొందాలన్నారు. జిల్లాలో ప్రాజెక్ట్ వైవిధ్యం కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అధికంగా వరి పండించడం వల్ల అధిక యూరియా వాడకం, కాన్సర్ రావడం, భూసారం కోల్పోవడంతో పలు సమస్యలు వస్తున్నాయన్నారు. పసుపు, వేరు శనగ విస్తీర్ణం తగ్గడం వల్ల పరిశ్రమలు మూత పది చాలా మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు. మార్కెట్ డిమాండ్ ఉన్న అపరాలు, చిరు ధాన్యాలు, నూనె గింజలు, ఆయిల్ పామ్, కూరగాయలు, పండ్లు, పూలు, మల్బరీ, మునగ, ఉల్లి వంటి పంటలు సాగు చేయాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, డీఏఓ విజయచంద్ర, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికా రి జినుగు మరియన్న, ఏఎంసీ వైస్ చైర్మమన్ మదన్ గోపాల్ లోయ, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ రావు, సర్పంచ్ గుండెల రేణుక, ఏఈఓలు పాల్గొన్నారు.


