● పారిపోతున్న బాలికలు
● గాలింపు చేపట్టి పట్టుకుంటున్న పోలీసులు
● అధికారుల పర్యవేక్షణ లేక సిబ్బంది
ఇష్టారాజ్యం
మహబూబాబాద్: జిల్లాలోని బాలసదనాల్లో భద్రతా వైఫల్యంతో బాలికలు పారిపోతున్నారు. ఈమేరకు పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టడం.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి బాలికలను పట్టుకుని తిరిగి బాలసదనాల్లో అప్పగిస్తున్నారు. కాగా, అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో బాలసదనాల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లలకు భద్రతలేదని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐదురోజుల క్రితం బాలసదనం నుంచి ఓ బాలిక పారిపోగా.. ఈనెల 22న రాత్రి పోలీసులు పట్టుకుని బాలసదనంలో అప్పగించారు.
జిల్లాలో ఐదు బాల సదనాలు..
జిల్లా సంక్షేమశాఖ పరిధిలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో ఐదు బాల సదనాలు ఉన్నాయి. వాటిలో మూడు ప్రైవేట్వి కాగా.. రెండు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. తొర్రూరు మండల కేంద్రంలో ప్రైవేట్ బాలికల బాల సదనం ఉండగా.. దానిలో 29 మంది బాలికలు ఉన్నారు. మానుకోట ప్రైవేట్ బాలుర బాలసదనంలో 12 మంది, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో మరో ప్రైవేట్ బాల సదనంలో 12 మంది ఉన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ బాలికల బాలసదనం ఉంది. అందులో 40 మంది బాలికలు, పాత కలెక్టరేట్ రోడ్డులో ప్రభుత్వ బాలుర బాలసదనంలో 20 మంది ఉన్నారు.
18 సంవత్సరాలలోపు పిల్లల కోసమే..
18 సంవత్సరాల లోపు పిల్లల కోసం ప్రభుత్వం బాల సదనాలు ఏర్పాటు చేసింది. అధికారులు, సి బ్బందికి లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. కాగా, త ల్లిదండ్రులు లేని పిల్లలు, పేదరికంలో ఉన్న వారు, తప్పిపోయిన వారు, బాల కార్మికులు, బాల్యవివాహాలు చేసుకున్న వారు, రిస్క్ చేసిన పిల్లలకు బాలసదనాల్లో ఆశ్రయం కలిస్తున్నారు. మైనర్ బాలికలు వివాహాలు చేసుకుంటే వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
2025 ఆగస్టులో నలుగురు పరార్..
జిల్లా కేంద్రంలోని బాలికల బాలసదనం నుంచి 2025 ఆగస్టు 27న రాత్రి 11.16 గంటలకు నలుగురు బాలికలు తప్పించుకుని పారిపోయారు. ఆ మరుసటిరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వరంగల్లో ఇద్దరిని, హైదరాబాద్లో మరో ఇద్దరిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో సమస్యకు ముగింపుకార్డు పడింది. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నారు.
ఐదు రోజుల క్రితం బాలిక..
జిల్లా కేంద్రంలోని బాలికల బాలసదనం నుంచి ఐదు రోజుల క్రితం ఓ బాలిక పారిపోయింది. ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. ఆతర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగా.. ఈనెల 22న గూడూరులో ఆ బాలికను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
కౌన్సెలింగ్..
బాల సదనాల నుంచి పారిపోయిన వారిని తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. తల్లిదండ్రులు స్పందించకుంటే బాలసదనాల్లో ఆశ్రయం కల్పించి ఓపెన్ టెన్త్, ఇంటర్, డిగ్రీ లాంటి కోర్సుల్లో చేర్పిస్తున్నారు.
విచారణ చేపట్టాం
బాలికల బాలసదనం నుంచి బాలికలుతప్పించుకుని పోయిన విషయంలో విచారణ చేస్తున్నాం. నివేదిక రూపంలో జిల్లా సంక్షేమాధికారికి అందజేస్తాం. తదుపరి చర్యలు జిల్లా అధికారి తీసుకుంటారు.
–పుట్ట కమలాకర్, డీసీపీఓ


