● తిరిగి మార్కెట్లో విక్రయిస్తుండగా
పట్టుబడిన వైనం
● 24 బస్తాలు స్వాధీనం
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ షెడ్లలో భద్రపరిచిన మార్క్ఫెడ్ మక్కల బస్తాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి, అవే మక్కలను తిరిగి మార్కెట్లో విక్రయిస్తుండగా పట్టుబడ్డాయి. ఈ మేరకు 24 మక్కల బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకుని మార్కెట్లో భద్రపరిచారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మార్క్ఫెడ్ ద్వారా కేసముద్రం, ధన్నసరి పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఇటీవల మక్కలను కొనుగోలు చేశారు. ఆ బస్తాలను కేసముద్రం వ్యవసాయ మార్కెట్ షెడ్లలో భద్రపరిచారు. కాగా, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ మక్కల బస్తాలను అపహరించారు. గురువారం ఆ మక్కలను విక్రయించేందుకు ఓ వ్యక్తి పేరుతో లాట్ ఐడీ తీసుకుని, యార్డులో పోశారు. కాగా, మార్కెట్ సిబ్బంది పరిశీలించి చూడగా.. ఆ మక్కల వద్ద ఎవరూ లేకపోవడం, అవి మార్క్ఫెడ్ మక్కలుగా గుర్తించి అధికారులు తెలియజేశారు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు అక్కడి నుంచి పరార్ అయినట్లు తెలిసింది. కాగా అధికారులు పట్టుబడిన మక్కల బస్తాలను మార్కెట్లోని ఓ గదిలో భద్రపరిచారు. అయితే దొరికిన బస్తాలే 24 ఉంటే, ఇంకా ఎన్ని బస్తాలు మాయం అయ్యాయనే విషయంపై సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు అధికారులు శుక్రవారం మక్కల బస్తాలను పరిశీలించారు. కాగా పత్తిషెడ్డులో నెట్గా వేసిన మక్కల బస్తాలు కూలి కిందపడి ఉండటంపై అధికారుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ విషయంపై సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.


