● వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు భూమి సునీల్
తొర్రూరు:‘భూ భారతి’ చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు భూమి సునీల్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భూ భారతి అమలు తీరు, రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్లు, సాదా బైనామాలు తదితర భూ సంబంధిత అంశాలపై ఆర్డీఓ గణేశ్, తహసీల్దార్లతో భూమి సునీల్ చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూ భారతి ద్వారా సాదా బైనామాలు, వాటి అమలు వేగవంతం అవుతుందన్నారు. భూ భారతి చట్టం తేవడానికి దేశంలోని అనేక రాష్ట్రాల్లో భూ చట్టాలను పరిశీలించామని తెలిపారు. చట్టం అమలులో తహసీల్దార్, ఆర్డీఓకు ప్రత్యేక అధికారాలు పొందుపర్చినట్లు చెప్పారు. క్రయ విక్రయాల సమయంలో సర్వే మ్యాప్ వచ్చిన వారికి తాత్కాలిక భూధార్ కార్డు ప్రభుత్వం ఇవ్వనుందన్నారు. గతంలో విశిష్ట సంఖ్యను ఇచ్చినట్లుగానే భూధార్ కార్డును ఇస్తారన్నారు. ఏఓ అనిల్కుమార్, తహసీల్దార్లు, లీఫ్ సంస్థ ప్రతినిధులు జీవన్రెడ్డి, అభిలాష్, మల్లేష్, ప్రవీణ్, రవి పాల్గొన్నారు.


