ములుగు రూరల్: మరొకరి పరీక్ష రాసిన ఘటన (మాల్ప్రాక్టీస్)లో ఓ వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా విధిన్తూ ప్రిన్సిపల్ జీఎఫ్సీఎం జడ్జి జ్యోత్న్స తీర్పు వెలువరించినట్లు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మంగళవారం తెలిపారు. జగన్నాథం నాగార్జున అనే వ్యక్తి 2017లో తన బాబాయ్ జగన్నాథం సాంబయ్యకు బదులు పదో తరగతి పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. ఈ సమయంలో ఇన్విజిలేటర్ హల్టికెట్ తనిఖీ చేస్తున్నాడు. హల్టికెట్లో ఉన్న వ్యక్తికి పరీక్ష కేంద్రంలో ఉన్న వ్యక్తికి తేడా ఉండడంతో గుర్తు పట్టి పోలీసులకు సమాచారం అందించడంతో వారు కేసు నమోదు చేశారు. ఈ కేసు ట్రయిల్ రన్కు రాగా కోర్టు కానిస్టేబుల్ దర్యాప్తు చేసిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇందులో నేరం రుజువుకావడంతో నేరస్తుడు నాగార్జునకు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించినట్లు ఎస్పీ తెలిపారు.
విద్యుదాఘాతంతో
యువ రైతు మృతి
● హజారియా తండా గ్రామంలో ఘటన
మహబూబాబాద్ రూరల్ : విద్యుదాఘాతంతో ఓ యువ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ మండలం హజారియా తండా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, రూరల్ పోలీసుల కథనంప్రకారం.. గ్రామానికి చెందిన ధరావత్ నరేశ్ (25)కు భార్య సింధు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం నీరు పెట్టడానికి పొలానికి వెళ్లిన నరేశ్ స్టార్టర్ ఆన్ చేస్తున్న చేస్తున్న క్రమంలో వైరు ఛాతిమీద పడి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే గమనించిన స్థానికులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య సింధు మంగళవారం మహబూబాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై పి.రాజు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రాజగోపుర నిర్మాణానికి భూసార పరీక్షలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయ మాడవీధుల నిర్మాణంలో భాగంగా రాజ గోపుర నిర్మాణ భూమి ధృడత్వాన్ని పరిశీలించేందుకు అంజీ జియో సొల్యూషన్స్ హైదరాబాద్ వారు మంగళవారం భూసార పరీక్షలు ప్రారంభించారు. ప్రతీ 1.5 మీటరు లోతులో మట్టిని సేకరించి పరీక్షించనున్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం రాజగోపుర పునాది ప్రమాణాలు నిర్ణయిస్తారు. కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయశాఖ ఇంజనీరింగ్ సెల్ సహాయ స్తపతి ఎడ్ల శివశంకర్, ఆలయ పర్యవేక్షకుడు కూచన హరినాఽథ్, ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, పాల్గొన్నారు. కాగా, మూడు రోజుల పాటు భూసార పరీక్షలు కొనసాగుతాయని అంజీ జియో సొల్యూషన్స్కు చెందిన సాంకేతిక నిపుణులు తెలిపారు.


