వరంగల్ అర్బన్ : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా(సీఎస్ఆర్)గా నగరాలు, పట్టణాల్లో వెనుకబడిన ప్రాంతాల్లో పేద పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో విద్యనందిస్తామని మెప్మా మిషన్ అడిషనల్ డైరెక్టర్ యాదగిరి రావు తెలిపారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మెప్మా అధికారులతో వివిధ అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో విద్యనదించడానికి రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ లెవెల్ టాస్క్ ఫోర్స్ (టీఎల్టీ) బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. అందులో వరంగల్ ఉమ్మడి జిల్లా ఒకటిఅన్నారు. సీఎస్ఆర్ కమిటీకి చైర్మన్గా కలెక్టర్లు, వైఎస్ చైర్మన్లుగా సంబంధిత నగరాలు, పట్టణాల కమిషనర్లు, సభ్యులుగా మెప్మా అధికారులు, సిబ్బంది ఉంటారని తెలిపారు. అట్టడుగు స్థాయిలో ఉండే పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో విద్యనుఅందించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. మెప్మా అధికారులు నూతన మహిళా సంఘాల (ఎస్హెచ్జీ) ఏర్పాటు పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న మహిళా సంఘాలు కాకుండా అదనంగా 30శాతం సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్ డైరెక్టర్ వెంకటేశ్వరావు, మెప్మా పీడీ రాజేశ్వర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, డీఎంసీలు రజితారాణి, రేణుక, విజయ, రాజేశ్వరి, ఇన్చార్జ్ డీఎంసీ హర్షవర్ధన్, ఏడీఎంసీలు వహీదా, సతీశ్, టీఏంసీలు రమేశ్, వెంకట్ రెడ్డి, సీఓలు సకినాల రమేశ్, ప్రవీణ్, శ్రీలత, రమాదేవి, రజిత తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా పాఠశాలలు
మెప్మా మిషన్ అడిషనల్ డైరెక్టర్ యాదగిరి రావు


