నయీంనగర్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గోర్ బంజారాలు శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు 18 నుంచి 27వ తేదీ వరకు తీజ్ ఉత్సవాలను జరుపుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లా గోర్ సేన అధ్యక్షుడు మాలోత్ చిట్టిబాబు నాయక్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోర్ సిక్వాడీ మీడియా వింగ్ అధ్యక్షుడు బాదావత్ బాలాజీ నాయక్తో కలిసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీజ్ పండుగ రోజును సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. చివరి రోజు సేవాలాల్ మహా రాజ్కు భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించి మేరమాయాడికి పూజలు చేస్తామన్నారు. రాష్ట్రీయ గోర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ నాయక్, చంద్రు తండా సర్పంచ్ రవి నాయక్, విజయ్ నాయక్, దేవేందర్, వెంకన్న, శ్రీధర్, నాగమణి, సోనాబాయి, అనూష బాయి, తదితరులు పాల్గొన్నారు.


