● ఎస్పీ శబరీష్
చిన్నగూడూరు: అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ శబరీష్ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్సై ప్రవీణ్కుమార్, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మండలంలోని సర్పంచ్లతో మాట్లాడారు. గ్రామ భద్రతలో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిర్వహణపై ఆయా గ్రామాల సర్పంచ్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. అంతేగాకుండా హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో ద్విచక్రవాహనాలు ఉన్న ప్రతీ ఒక్కరికి హెల్మెట్ ఉండాలన్నారు. ముఖ్యంగా మత్తు పదార్థాల వినియోగంపై దృష్టిసారించి సమాచారం అందించాలన్నారు. అన్ని అంశాలపై సర్పంచ్లు పూర్తి బాధ్యత వహించి మండలంలోని ఏవేని మూడు జీపీలు వారంలోపు వందశాతం రిజల్ట్ పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత, ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై వెంకటయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


