విద్యారంగానికి మొండిచేయి
హన్మకొండ : రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపింది. రూ.3,24,234 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం రూ.26,674 కోట్లు మాత్రమే కేటాయించింది. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో 7.6 శాతం నిధులు కేటాయించగా ఈసారి 8.22 శాతం మాత్రమే కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామన్న హామీకి తూట్లు పొడిచింది. ఈ బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
– గడ్డం నాగార్జున,
ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
విజన్ లేదు.. విషయం లేదు..
హన్మకొండ : అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విజన్ లేదు.. విషయం లేదు.. క్లారిటీ లేదు.. కమిట్మెంట్ లేదు.. సరుకు లేదు.. సురుకు లేదు.. ఇది బడాయి, బోగస్, బుకాయింపు, భ్రమల బడ్జెట్. సామాన్య ప్రజలకు, పెట్టుబడిదారులకు, మార్కెట్కు విశ్వాసం కల్పించడంలో విఫలమైంది. ఓటు వేసిన వాళ్లకు వెన్నుపోటు పొడిచారు. ఆరు గ్యారంటీలకు మంగళం పాడారు. డిక్లరేషన్లకు నీళ్లు వదిలారు. యువత బతుకుదెరువుకు సమాధి కడుతూ భవిష్యత్ను శాశ్వతంగా దెబ్బతీసే బడ్జెట్ ఇది.
– ఏనుగుల రాకేష్రెడ్డి,
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు


