● ఆర్పీఎఫ్ ఎస్సై సుభాని
మహబూబాబాద్ రూరల్ : ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆర్పీఎఫ్ అధికారుల ఆదేశాల మేరకు భద్రతా సూచనలు పాటించాలని ఆర్పీఎఫ్ ఎస్సై సుభాని అన్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో గురువారం తనిఖీలు చేపట్టి, ప్రయాణికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ ఎస్సై సుభాని మాట్లాడుతూ సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆళ్లకుంట నవీన్ కుమార్ ఆదేశాల మేరకు వేసవి కాలం, వేసవి సెలవులు, శాంతిభద్రతల దృష్ట్యా ప్రయాణికులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. రైల్వే పరిసరాల్లో ప్రజలు అనధికారికంగా బండ్లను ఆపోద్దని, పట్టాలు దాటొద్దని, పేలుడు పదార్థాలతో ప్రయాణించడం నేరమని వివరించారు. వేసవికాలంలో మంటలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై వివరించారు. రైల్వే అభివృద్ధి, రైల్వే ఆస్తుల రక్షణ, ప్రయాణికుల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తామని, ఇందుకు ప్రజలు, ప్రయాణికులు సహకరించాలని కోరారు.


